
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో నేడు (బుధవారం) పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్తో భేటీకానున్నారు. జూన్ 14న జరిగిన అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు మునీర్ ఆహ్వానంపై పలు ఆరోపణలువచ్చిన దరిమిలా వాటిని వైట్ హౌస్ ఖండించింది.
అయితే ఇది జరిగిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను నేడు(జూన్ 18) కలుసుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు (వాషింగ్టన్ సమయం) వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ను ట్రంప్ కలుసుకోనున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మునీర్ తన అమెరికా పర్యటనలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్లను కూడా కలుసుకోనున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్ మునీర్ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇప్పుడు మునిర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే మునీర్కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..