
న్యూఢిల్లీ: భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేందర్ మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలుసుకున్నారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక సమావేశాలతో బలోపేతమవుతాయని భారత్ భావిస్తోంది.
ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్న సమయంలో ప్రధాని మోదీ భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఇంధన భద్రత, ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు.
ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆల్బెర్టాకు వెళ్లారు. భారతదేశానికి జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు హాజరయ్యింది. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు బహుళ రంగాలలో కొనసాగుతున్న భాగస్వామ్యాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కెనడా.. భారత్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్తో కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ఇదే తొలిసారి.
నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు కెనడాలో బలోపేతం అయ్యేందుకు అనుమతించిందని ఆరోపించింది. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికవేత్త కార్నీ, ఏప్రిల్లో జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధానిగా అత్యున్నత పదవి చేపట్టారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వాలు పెరుగుతున్న నేపథ్యంలో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనిలో జీ 7 దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ చర్యలను ఖండించాయి.
ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్తో పాటు ప్రియుడు..