భరత్‌నగర్‌ ఆర్‌వోబీ ఆధునికీకరణ | - | Sakshi
Sakshi News home page

భరత్‌నగర్‌ ఆర్‌వోబీ ఆధునికీకరణ

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

కొత్త సాంకేతికతతో త్వరలో పనులు

కన్సల్టెన్సీలను ఆహ్వానించిన సీఎంసీ

సాక్షి, సిటీబ్యూరో: మూసాపేట సర్కిల్‌లోని భరత్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) ఆధునికీకరణకు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ) సిద్ధమైంది. పనులు చేయడానికి ముందు కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లు ఆహ్వానించింది. బ్రిడ్జిలు, ఆర్‌వోబీలు, ఫ్లై ఓవర్ల పునరుద్ధరణ పనులు చేసిన అనుభవం ఉన్న సంస్థలు టెండర్లలో పాల్గొనాల్సిందిగా పేర్కొంది. టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. టెక్నికల్‌గా అర్హత పొందిన సంస్థల ఫైనాన్షియల్‌ బిడ్లు పరిశీలిస్తారు. టెండర్లలో పాల్గొనే ఏజెన్సీ సొంతంగానే పనులు చేయాలి. ఒక ఏజెన్సీ ఒక టెండరు మాత్రమే వేయాలి. పనులు వేగంగా, సమర్థంగా, తక్కువ వ్యయంతో చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ సాంకేతిక విధానాలను ఎంచుకోవచ్చు. బిడ్లు దాఖలుకు ముందు ఏజెన్సీలు ఆర్‌వోబీని, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గర్డర్లు, డయాఫ్రమ్స్‌, బేరింగ్‌ రీజియన్స్‌, పియర్స్‌ తదితరాల స్థితిగతులు తెలుసుకోవాలని సూచించారు. ఆర్‌వోబీ డేటా, నివేదికల అధ్యయనానికి సమాచారాన్ని కార్పొరేషన్‌ అందజేస్తుంది. వాటిని విశ్లేషించడంతో పాటు కావాల్సిన ఇతర వివరాలు సేకరించాల్సిన బాధ్య త ఏజెన్సీదే. కన్సల్టెన్సీ సర్వీసులకు ఎంపికయ్యే సంస్థ మూడు నెలల్లోగా నివేదిక అందజేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement