కుషాయిగూడ: తండ్రికి అనారోగ్యం, కూతురు వివాహం, కొత్త ఇంటి నిర్మాణం.. ఇలా పలు కారణాలు చెప్పి.. రూ.50 కోట్లు వసూలు చేసిన సిమెంట్ వ్యాపారి చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. విషయం తెలిసిన బాధితులు లబోదిబోమంటూ మల్కాజిగిరి సీపీ సుమతికి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పబ్బ చంద్రశేఖర్ కుషాయిగూడ చక్రిపురం భగవాన్ కాలనీలో ఉంటూ సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, కూతురు వివాహం కుదిరిందని, కొత్త ఇంటి నిర్మాణం చేస్తున్నానని, వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఇన్సెటివ్స్ వస్తాయని నమ్మబలికాడు. రూ.50 లక్షల జీఎస్టీ చెల్లిస్తే రూ.3 కోట్లు రిలీజవుతాయని చెప్పి నమ్మకస్తుల వద్ద వడ్డీకి, చేబదులుగా రూ.50 కోట్లకు పైగా అప్పు చేశాడు. గడువు ముగుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు చంద్రశేఖర్కు ఫోన్ చేయసాగారు. గత నెల 22 నుంచి చంద్రశేఖర్ ఫోన్లు స్వీచాఫ్ వస్తున్నాయి. దీంతో కొందరు బాధితులు భగవాన్ కాలనీలోని ఇంటికి వెళ్లి చూడగా.. ఇద్దరు కూతుళ్లను తన తమ్ముడి వద్ద ఉంచి భార్యతో కలిసి ఉడాయించినట్లు తెలుసుకున్నారు. మంగళవారం 60 మంది బాధితులతో పాటు ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో కలిసి మల్కాజిగిరి సీపీ సుమతిని కలిసి న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు.
మల్కాజిగిరి సీపీకి బాధితుల ఫిర్యాదు


