బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి జేపీ నడ్డా. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుంది
వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది
రాష్ట్ర పార్టీ నేతలతో కేంద్రమంత్రి జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు తలుపులు తెరవాలని రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. వేరే పార్టీలకు చెందిన వారిని కలుపుకుంటేనే బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ‘మీరు కష్టపడి పనిచేయండి మీతోపాటు మేము ఉంటాం. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అభిమానించేంతలా చూసుకోవాలి. కార్యకర్తలతో మంచిగా ఉండండి. వారితో మంచిగా లేకుంటే మీరు డిస్కనెక్ట్ అవుతారు’అని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచా రం ఉందన్నారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన నడ్డా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘ఇప్పటికే ఒకసారి మన బస్సు (అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి) మిస్సయింది. ఇంకోసారి బస్సు మిస్ కానివ్వకండి. వేర్లు లేని చెట్ల లాగా మారకండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల వ్యతిరేకతే మనల్ని గెలిపిస్తుందనే భావనతో ఉండకండి. సొంతంగా పార్టీ గెలిచేందుకు మనం ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. నేను అవినీతికి పాల్పడను. ఇంకొకరిని అవినీతి చేయనివ్వను అన్న ప్రాథమిక సూత్రంతోనే మోదీ విజయం సాధించారు.
మనమంతా కూడా మోదీ పేరు చెప్పుకొని గెలుస్తున్నా...సొంతంగా గెలుపు కోసం అనుసరించబోయే కార్యాచరణ ఉందా ? మీ అంత మీరు గెలిచేందుకు ఏం చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోండి. అవినీతితో పోరాడడంతోపాటు ఎల్లప్పుడూ ప్రజల పక్కనే చేదోడువాదోడుగా నిలిస్తే తప్పకుండా వారు ఆదరిస్తారు. మీ మీ కార్యక్షేత్రాలను వదలకుండా కష్టపడి పనిచేయాలి. లీడర్ల వెంట తిరిగినంత మాత్రాన లీడర్లు కాలేరు. రేపు కాంగ్రెస్ నేతలను (హిమాచల్లో) కలవడానికి వెళుతున్నాను. ఎందుకంటే వారిని కలిస్తే వారు మనవారు అవుతారు’అని నడ్డా దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటిమోహన్రావు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శాంతికుమార్, చింతల రామచంద్రారెడ్డి బండారు విజయలక్ష్మి, లంకెల దీపక్రెడ్డి, కప్పర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చిన సర్కార్ ఉండాలా ?
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎంగా మారిందని, అదే ప్రభుత్వం కొనసాగాలా? మారాలా? అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గురువారం ఓ హోటల్లో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం–దౌత్యం–అభివృద్ధి’అంశంపై నిర్వహించిన మేధావుల గోష్టిలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ను అంతర్గతంగా బలోపేతం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీదని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్సీయూ వీసీ జె.అనురాధ, ఐఫ్లూ వీసీ ప్రొ.నాగళ్లపల్లి నాగరాజ్ ప్రసంగించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వివిధరంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు.


