జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా
కుషాయిగూడ: కొద్ది నెలల్లోనే చర్లపల్లి చెరువు పర్యాటక ప్రాంతంగా మారనుందని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. చెరువు పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. హైడ్రా సాంకేతిక సహకారం, ఐఓసీఎల్, చర్లపల్లి పారిశ్రామికవేత్తల సీఎస్ఆర్ ఆర్థిక సాయంతో చర్లపల్లి చెరువు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆరు మాసాల్లో సుందరీకరణ పనులు పూర్తి పచ్చదనం పరిఢవిల్లేలా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత జోన్గా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమన్నారు. పునరుద్ధరణ పనుల్లో చర్లపల్లి ఓపెన్ జైల్లోని ఆశ్రమవాసులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుతో చర్లపల్లి జైలుకు అనుసంధానం చేస్తామన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి చెరువు పునరుద్ధరణకు ముందుకు వచ్చిన జైళ్లశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీ వై.రాజేష్, డీఐజీ డాక్టర్ డి. శ్రీనివాస్ పాల్గొన్నారు.


