● మాజీ డీజీపీ శివధర్రెడ్డి
బంజారాహిల్స్: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలను చదువుతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్పోర్ట్స్ అండ్ వెల్ బీయింగ్ డే’ కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివధర్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపయోగపడే వినూత్న అకడమిక్ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


