టాటా షోరూంలో అగ్నిప్రమాదం
కుషాయిగూడ: కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో నిర్వహిస్తున్న టాటా షోరూంలో డెంటింగ్, పెయింటింగ్ చేసే యూనిట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎండల తీవ్రతకు బ్యాటరీలు పేలి మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన షోరూం సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారమిచ్చి షోరూంలో ఉన్న కార్లను బయటకు తీశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా టాటా షోరూం పక్కనే ఉన్న సప్తగిరి హైట్స్ అపార్ట్మెంటు వైపుగా మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన అపార్టుమెంట్వాసులు బయటకు పరుగులు తీశారు. సుమారు 20 లక్షల వరకు ఆస్థినష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యమే ప్రదాన కారణం..
అక్రమంగా నిర్మించిన షెడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న షోరూంపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేసిన అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణమని 2022లో నోటీసులు జారీ చేసి కూల్చివేతలకు సిద్ధమైన అధికారులు కూల్చివేయకుండా వదిలివేయడంతోనే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టాటా షోరూం నిర్వాహకులపై స్థానికులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


