కేర్ ఆస్పత్రిలో అరుదైన శ్వాసనాళ చికిత్స
రాయదుర్గం: హైటెక్సిటీ కేర్ ఆస్పత్రి వైద్య బృందం ఓ వృద్ధుడికి అరుదైన శ్వాసనాళ చికిత్స చేసింది.కేర్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ డాక్టర్ సతీష్ సి రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ డాక్టర్ ఎం అబ్దుల్ ఆమ్జద్ఖాన్ తెలిపిన మేరకు.. నగరానికి చెందిన ఓ వృద్ధుడు (60) గతంలో ప్రమాదంలో గాయపడి వెన్నముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. శ్వాస సౌకర్యం కోసం ట్రాకియోస్టమీ చేశారు. అయితే ఇటీవల శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో కేర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన బ్రోంకోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సాంకేతికతలతో శస్త్ర చికిత్స అవసరం లేకుండా శ్వాసనాళాన్ని పునరుద్దరించి మళ్లీ మాట వచ్చేలా చేయగలిగామన్నారు.
నీట్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
సుల్తాన్బజార్: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐచే విచారణ జరిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కిషన్, డాక్టర్ బి.అశోక్లు బుధవారం డిమాండ్ చేశారు.22 లక్షల మంది భావి వైద్య అభ్యర్థులకు ఘోర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 2024 నాటి నీట్ పేపర్ లీక్ పరాభవం మళ్లీ పునరావృతం కావడం ఆందోళన కరణమన్నారు. సుమారు 140 ప్రశ్నలతో కూడిన చేతితో రాసిన గెస్ పేపర్ 720 మార్కులలో 600 మార్కులకు సమానమైన అసలు ప్రశ్నలతో సరిపోలిందన్నారు. పరీక్షకు కొన్ని రోజుల ముందే ఈ పేపర్ చలామణి అయ్యిందన్నారు. లీకై న మెటీరియల్ ఉపయోగించిన అభ్యర్థులను శాశ్వతంగా నిషేధించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్: లక్నోలో జరుగుతున్న రెండో ఆలిండియా బ్యాడ్మింటన్–టేబుల్ టెణ్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ పోలీసులు రజత పతకం కై వసం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, హుజురాబాద్ ఏసీపీ మాధవి మిక్స్డబుల్స్ కేటగిరిలో రజత పతకం అందుకున్నారు. లక్నోలో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం వీరు తమ సత్తా చాటి రెండో స్థానంలో నిలిచారు. గోల్డ్ మెడల్ ఇంటిలిజెన్స్ బ్యూరో జట్టుకు రాగా, సిల్వర్ మెడల్ కట్టా హరిప్రసాద్, మాధవి గెలుచుకున్నారు. కాంస్య పతకం ఐజీ రవికృష్ణ, ఎస్పీ స్వరూపరాణిలు సాధించారు.


