సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికుల సంక్షేమానికి తెలంగాణ మాజీ సైనిక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్.బాబు కోరారు. అలాగే ముఖ్యమంత్రి చైర్మెన్గా రాజ్య సైనిక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారు. విధి విధానాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో మాజీ సైనిక కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయో, వాటి విధానాలు, నమూనాలను సేకరించి త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు గవర్నర్ చైర్మన్గా ఉన్న స్టేట్ మేనేజింగ్ కమిటీ ఏర్పాటుకు సైతం త్వరలోనే ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.మాజీ సైనికుల సమస్యలపై పూర్తి వివరాలతో నివేదికను అందజేయాలని చెప్పారు.ఆ నివేదికలోని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి,తదితరులు పాల్గొన్నారు.


