● డీఐజీ రమణారెడ్డి
వెంగళరావునగర్ : విధి నిర్వహణలో క్రమశిక్షణ, నైపుణ్యంతో పాటు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని డీఐజీ వి.రమణారెడ్డి తెలియజేశారు. యూసుఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్లో నాలుగు వారాల పాటు నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్) హవల్దార్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం హవల్దార్లకు ప్రత్యేక అభినందన సమావేశాన్ని బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమణారెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే సిబ్బంది అధికారులు నిరంతరం నిజాయితీ కలిగి ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి తలొగ్గ వద్దని సూచించారు. ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధి నిర్వహణలో మెరుగైన సామర్థ్యం పెరుగుతుందని తెలియజేశారు. నాసిన్ జోనల్ డైరెక్టర్ టి.అనంత్ శిక్షణ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి సర్టిఫికెట్లు, ప్రత్యేక ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమ ఆల్రౌండర్ ప్రదర్శన ఇచ్చన మౌనిక అనే హవల్దార్కు సర్టిఫికెట్తో పాటుగా షీల్డ్ను అందజేసి అభినందించారు. తొలుత టీఎస్ఎస్పీ ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు సైనిక వందనం చేశారు.


