బంజారాహిల్స్: బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ (సీఎస్ఏఎం) ఆన్లైన్లో ప్రసారం చేసినట్లు ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ వైష్ణవీ ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేశారు. అనుమానాస్పద ఇన్స్ట్రాగామ్ ఖాతా మొబైల్ నెంబర్తో ఈ అశ్లీల కంటెంట్ లింక్ అయ్యి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతా యూసుఫ్గూడ కృష్ణానగర్కు చెందిన ఓ మహిళదిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి ఐసీయూలో చికిత్స
మన్సూరాబాద్: వీధి కుక్కల దాడిలో గాయపడి ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు అద్వీక్కు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నామని కామినేని వైద్యులు తెలిపారు. బాగా లోతైన కుక్క గాట్లు ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకకుండా మందులు ఇస్తున్నామని, ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. బాలుడు స్పృహలోనే ఉన్నాడని, వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని, మరో 24 గంటలు గడిస్తే పరిస్థితి తెలుస్తుందని వైద్యులు స్పష్టం చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
ఉప్పల్: ఆన్లైన్ ట్రేడింగ్తో నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యచేసుకున్నాడు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు..రామంతాపూర్ నవరంగ్ గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబిబూద్ధీన్ (36) క్రిప్టో కరెన్సీ అన్లైన్లో ట్రేడింగ్ చేస్తూ నష్టపోయాడు. దీంతో అప్పుల భారం పెరిగి మనస్థాపంతో మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


