ఘట్కేసర్: ఎదులాబాద్ డివిజన్ అంకుషాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామానికి చెందిన అన్వర్ (50) పట్టణంలోని ఓ సెకండ్ హ్యాండ్ సేల్ షోరూంలో ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తుంటాడు. షోరూం యజమానులు నిర్మల్ జిల్లా బాన్సువాడలో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ను కొనుగోలు చేయగా తీసుకురావడానికి మంగళవారం వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రావకపోవడం, ఫోన్ స్విచాప్ రావడంతో అన్వర్ భార్య షోరూం యజమానికి తెలిపింది. అప్రమత్తమైన యజమాని తూప్రాన్ సమీనంలోని టోల్ ప్లాజా వద్ద సీసీ పుటేజీలు పరిశీలించగా ట్రాక్టర్ టోల్ దాటలేదని గ్రహించారు. కాగా అన్వర్ ట్రాక్టర్ను తీసుకొని ఘట్కేసర్కు వస్తుండగా మెదక్ జిల్లా శభాష్పల్లి శివారు పోతారం రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ట్రాక్టర్తో పరారయ్యారు. దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో బుధవారం విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ లభించకపోవడంతో ఆర్థిక కోణం, వివాహేతర సంబంధం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మెదక్ జిల్లా పోతారం రోడ్డుపై దారుణం
ట్రాక్టర్ అపహరించిన దుండగులు
వివాహేతర సంబంధమే కారణం!


