● అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
నాంపల్లి: ప్రజారోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర కీలకమని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోగులకు వైద్యసేవలతోపాటు మనోధైర్యాన్ని ఇస్తూ మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని కొనియాడారు. 1,500 మంది అవుట్ పేషంట్స్, 2 వేల మంది ఇన్ పేషంట్స్ ఉన్న ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఎక్కడా అలసిపోకుండా సేవలు అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం పలువురు నర్సులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్ఓ వెంకట్, నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్కుమార్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


