సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేయండి | - | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేయండి

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేయండి

నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌పై మంత్రి సీరియస్‌

జూన్‌ నాటికి జవహర్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులకు పొంగులేటి ఆదేశం

సాక్షి, సిటీబ్యూరో: అల్వాల్‌ మండలంలోని సర్వే నంబర్లు 582, 583లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ భూముల్లో సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న వడ్డెర కులస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి స్పందించారు. ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి అధ్యక్షతన వహించి మాట్లాడారు. జవహర్‌నగర్‌లో 6,399 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను జూన్‌ నాటికి పూర్తి చేసి అల్వాల్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాల పేదలకు లాటరీ విధానంలో కేటాయించాలని అధికారులకు సూచించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే అవకాశం ఉండగా కేవలం 1,622 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, దానం నాగేందర్‌, ఆరికపూడి గాంధీ, వి.పి.గౌతమ్‌, కలెక్టర్‌ మను చౌదరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement