ఉపాధి కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనే లక్ష్యం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

ఉపాధి కల్పనే లక్ష్యం

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

సరూర్‌నగర్‌లో మెగా జాబ్‌మేళా

భారీగా తరలివచ్చిన అభ్యర్థులు

779 మందికి నియామక పత్రాలు

హుడాకాంప్లెక్స్‌: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 1,645 మందితో జాబితా కుదించి, 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయి. మంత్రి మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగా పనిచేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement