ప్రచారంలో నిమగ్నమైన గ్రేటర్ బీజేపీ నేతలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణ చేసేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక్కో డివిజన్కు కనీసం 500 నుంచి 1000 మందిని తరలించాలని లక్ష్యాలను నిర్దేశించింది. బీజేవైఎం ఆధ్వర్యంలో డివిజన్కు వంద బైకులకు తగ్గకుండా ర్యాలీ తీయాలని నిర్ణయించారు. అదే సమయంలో జనం స్వచ్ఛందంగా తరలి రావాలని కాలనీల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్, నియోజకవర్గ స్థాయి నేతలతో పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర జన సమూహ ప్రాంతాల్లో కర పత్రాల పంపిణీ చేస్తున్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, మహిళా సంఘాలు, కార్మిక, ఇతర సంఘాలను సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మోదీ సభ ప్రత్యేకతలను వివరించడం, గోడలపై పెయింటింగ్స్, ఇతర ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలతో కార్యాచరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా.. పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం, నాయకత్వానికి మేమున్నామని ధైర్యం కల్పించడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ సభ బీజేపీకి ఒక ఆయుధంగా ఉపయోగపడతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెండో దశ హైదరాబాద్ మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, వైద్యం, రైల్వే, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు ఇతర రంగాల్లో కేంద్రం అందించిన రూ.లక్షల కోట్లు నిధులను ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు.


