పూర్తిస్థాయి యుద్ధమే వస్తే... | Sakshi Guest Column On If India Pakistan War Comes | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయి యుద్ధమే వస్తే...

May 9 2025 3:16 AM | Updated on May 9 2025 3:16 AM

Sakshi Guest Column On If India Pakistan War Comes

అభిప్రాయం

పాకిస్తాన్‌ దుశ్చర్యల కారణంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను భారత్‌ అనివార్యంగా చేపట్టింది. అయితే దీనికి ప్రతి చర్యగా పాకిస్తాన్‌ ఉత్తర, పశ్చిమ భారత్‌లలోని 15 లక్ష్యా లపై దాడికి ప్రయత్నించింది. భారత్‌ ఈ దాడులను దీటుగా ఎదుర్కొని పాక్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చివేసింది. అలాగే పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్‌ లక్ష్యంగా చేసుకోవడంతో లాహోర్‌ లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ నిర్వీర్యమయ్యింది. 

భారత్‌ కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంచేసుకుని ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. కానీ పాక్‌... తన పౌరులపై దాడి చేసినట్లు దుష్ప్రచారం మొదలు పెట్టింది. నిజానికి పాకిస్తానే సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపి 16 మంది భారత పౌరులను పొట్టన పెట్టుకుందని విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని ప్రకటించడం గమనార్హం.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో సహా పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ  శిబిరాలపై భారత్‌ దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. నియంత్రణ  రేఖ వద్ద పాకిస్తాన్‌ విచ్చ లవిడిగా కాల్పులు ప్రారంభించింది. ఈ దాడిలో అమాయకులైన సరిహద్దు గ్రామాల ప్రజలు చని పోతున్నారు, గాయపడుతున్నారు. 

శ్రీనగర్, జమ్మూల లెఫ్టినెంట్‌ గవర్నర్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పాకిస్తాన్‌ దుశ్చర్యలు దానికి మరిన్ని కష్టాలు తీసుకువస్తాయి తప్ప పరిస్థితి సద్దు మణిగే అవకాశం లేదు. ఈ దాడుల్లో జైష్‌ ఏ మహ మ్మద్‌కు చెందిన మౌలానా మసూద్‌ అజార్‌ కుటుంబ సభ్యులు చనిపోవడంతో అతడు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ మన ప్రధానికి ఒక హెచ్చరిక లేఖను పంపాడు. 

అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ తిరిగి తన పరువును నిలబెట్టుకోవడం కోసం మూడు స్థాయి లలో భారత్‌పై దాడి చేస్తోంది. ఇవి: ఒకటి, భారత సరి హద్దు ప్రాంతాల్లో తీవ్ర చర్యలు చేపట్టడం, రెండు, భారత్‌పై ఆక్రమణ చర్యలకు పూనుకోవడం, మూడు, ప్రతీకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం.

గతంలో ఈ ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడానికి మాత్రమే మనం వ్యూహాన్ని రచించేవాళ్ళం. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మన వ్యూహం కూడా మారింది. రాజ్యాంగ అధికరణ 370ను రద్దు చేయడంతో కశ్మీర్‌లో 90 శాతం తీవ్రవాదం తగ్గిపోయింది. అక్కడ సాధారణ జనజీవన స్రవంతి నెలకొంది. దీనిని ఈర్ష్యతో, పగతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. అందుకే కొత్తగా ఉగ్రదాడులకు తెరలేపింది. ఈసారి జరిగిన దాడులకు ఇజ్రాయెల్‌ తరహాలో భారత్‌ ప్రతిస్పందించింది. 

భారత్‌ తన యుద్ధతంత్రం మార్చి దౌత్యపరంగా, ఆర్థికంగా, సాంకేతికంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఒక ఉగ్రవాద దేశంగా నిరూపించడంలో కొంత విజయం సాధించగలిగింది. 53 దేశాలు భారత్‌కి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు తెలియజేయడం విశేషం. అమెరికా పాత్ర పాకిస్తాన్, భారత్‌ల విషయంలో గోడ మీద పిల్లిలా కనిపిస్తోంది. 

ఇదే మంచి అవకాశం
ఈ సమయంలో పాకిస్తాన్‌ ఏ ఒక్క చిన్న పొర పాటు చేసినా అది పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఉగ్రవాద స్థావరాలకు నెలవుగా మారిన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది. అయితే యుద్ధం తలెత్తితే చైనా కచ్చితంగా పాకిస్తాన్‌కు సహాయం చేస్తుంది. కారణం భారత్‌ను చైనా చిరకాల శత్రువుగా భావించడం. అలాగే బంగ్లా దేశ్‌ను మతం పేరుతో పాక్‌ దగ్గర తీసుకునే అవకాశం లేకపోలేదు. 

అంటే యుద్ధం వస్తే భారత్‌ మూడు వైపుల నుంచి ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కేవలం పంజాబ్, రాజస్థాన్, కశ్మీర్, గుజరాత్‌ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన ‘చికెన్‌ నెక్‌’ లేదా సిల్‌గురి కారిడార్‌పై చైనా ఎప్పటి నుంచో కన్ను వేసిన విషయం గుర్తుంచుకోవాలి.  

భారత్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్‌ పదేపదే హెచ్చరిస్తోంది. ఇదే జరిగితే భారత్‌కు ఎక్కువ నష్టం కలగకపోవచ్చు కానీ పాకిస్తాన్‌ ‘మరుసటి రోజు సూర్యోదయం చూడదు’ అనే మాట అతిశయోక్తి కాదు. మనం అణ్వాయుధాల విషయంలో ‘మొదట మేం ప్రయోగించం’ అని చెప్పాము గాని ‘ఇతర దేశాలు ప్రయోగించినా మేం ప్రయోగించం’ అని ఎప్పుడూ చెప్పలేదు. 

ప్రపంచంలో నాలుగవ రక్షణ శక్తిగా ఉన్న భారతదేశం అన్ని రకాలుగానూ పాకి స్తాన్‌ను ఎదుర్కోగలుగుతుంది. పౌరులు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించి, అనుమానాస్పదమైన సంఘటనలను ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అవసరమైతే కదనరంగంలో కాలు పెట్టాలి. అప్పుడే ఉగ్రవాదంపై చేస్తున్న పోరులో విజయం సాధించ గలుగుతాం.

మేజర్‌ (రిటైర్డ్‌) శ్రీనివాస్‌ 
వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ రంగ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement