రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా? | Shravana Purnima Raksha Bandhan Jandhyala Purnima Speciality | Sakshi
Sakshi News home page

రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?

Aug 27 2026 8:12 AM | Updated on Aug 27 2026 8:45 AM

Shravana Purnima Raksha Bandhan Jandhyala Purnima Speciality

భక్తి

భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. శివకేశవులను స్మరిస్తూ వారి శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని పాటించడం, సంప్రదాయాలను ఆచరించడం అవసరం. అయితే శ్రావణ పూర్ణిమ పేరు చెప్పగానే అన్నింటికన్నా ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధన పర్వమే.

భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, భూత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.

పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచు యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది.

రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణకోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తోడ్‌ గఢ్‌ మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌  ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.

నారీపూర్ణిమ:
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నారీ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి నారికేళాలను అంటే కొబ్బరికాయలను వదులుతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నారియల్‌ పూర్ణిమగా) వ్యవహారంలోకి వచ్చింది.

జంధ్యాల పున్నమి పాల్కురికి సోమనాథకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమి అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.

హయగ్రీవ జయంతి:
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని, మరేదైనా వరం కోరుకోవలసిందని అమ్మవారు చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.

ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.

దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ దుష్ట రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమ ను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని, శివశక్తిని ఈ కథ తెలియజెబుతుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

జంధ్యాల పౌర్ణమి: సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే ’యజ్ఞోపవీతం’ అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం.

ఇలా శ్రావణపూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని పంచామృతాలతో లేదా ఆవునేతితో లేదా ఆవుపాలతో అభిషేకించి, రుద్రనమక చమకాలతో ఆరాధించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలు, భయాలు తొలగి, చక్కటి ఆరోగ్యం, తేజస్సు కలుగుతాయి.

ఉపాకర్మ
ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనినే ముంజ అంటారు. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ మంజను తీసి వేస్తారు. అందుకే ముంజ విడుపు అని కూడా ఈ కార్యక్రమానికి పేరు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ’జంధ్యాల పూర్ణిమ’ కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. 
– డి.వరలక్ష్మి

ఇవి కూడా చదవండి: శివుడు శరభుడిగా ఎందుకు మారాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement