
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశా (Odisha) 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు (wildfires) ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది.
ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలుపాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్ధేరే అన్నారు.

ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలుపాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.
సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారం
ఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో కాపాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.

సాంస్కృతిక పునరుద్ధరణ
సంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. ‘గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం’ అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.
పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు ‘సంకీర్తన మండలి’ అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.
చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం
ఉపాధి గీతాలు
రాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. ‘కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది‘ అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు.
చదవండి: మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?
కేతకి నాయక్కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది.
ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: Food Safety ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు