టీచర్లు టెక్ట్స్బుక్స్ చదువుతారు. సిలబస్ మారితే కొత్త పాఠ్యపుస్తకాలు చదువుతారు. సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నవారు ఆ సబ్జెక్ట్కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు. కాని పుస్తకాలు చదువుతున్నారా?
పుస్తకాలంటే...
సాహిత్యం, చరిత్ర, రాజకీయాలు, జీవిత చరిత్రలు, సినిమా, సంగీతం, సైకాలజీ, యాత్రాకథనాలు... ఈ పుస్తకాలు చదువుతున్నారా? హెచ్ఆర్ఏ అందుకునే టీచర్లు తమ నివాసంలో కనీసం ఒక బుక్షెల్ఫ్ అయినా మెయిన్టెయిన్ చేస్తున్నారా? ఎందుకంటే పుస్తక పఠనం ఉపాధ్యాయులకు చాలా మేలు చేస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. బెంగళూరు నగరంలో టీచర్ల బుక్క్లబ్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.
→ రెండు విధాలా మేలు..
పుస్తకాలు చదవడం వ్యక్తిగతంగా, వృత్తిగతంగా మేలు కలిగిస్తున్నాయి. బెంగళూరులోని క్రేయన్ ప్రీస్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ మధు ప్రకాశ్ కొన్నిరోజుల నుంచి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఏ అనారోగ్య సమస్యా లేదు. అయినా జీవితంలో ఏదో వెలితి. ఆ వెలితిని పుస్తక పఠనం ద్వారా అధిగమించారు. రోజూ కనీసం అరగంట సేపు పుస్తకాలు చదవడం ద్వారా ఒత్తిడి దూరమవడంతోపాటు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని, దానివల్ల ఉద్యోగం మీద ఏకాగ్రత పెరిగిందని వివరిస్తున్నారామె.
ఆమె అనుభవం తెలుసుకున్న మరికొందరు టీచర్లు పుస్తకాలు అందుకున్నారు. విద్యావేత్త నీలమ్ దీక్షిత్ పరిశీలనలో రోజుకో అరగంటపాటు పుస్తకాలు, దినపత్రికలు చదివే టీచర్లు ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నారని వివరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు బుక్ క్లబ్లు ఏర్పాటు చేసి టీచర్లను అందులో భాగస్వాములను చేస్తున్నారు. వారానికో పుస్తకం చొప్పున చదివేలా ప్రోత్సహిస్తున్నారు. తమతోపాటు టీచర్లు కూడా కూర్చొని పుస్తకాలు చదువుతుండటంతో పిల్లలకు అది ఉత్సాహం కలిగిస్తోందని పాఠశాల యాజమాన్యాలు అంటున్నాయి.
→ అభి్రపాయాలను మారుస్తూ..
‘అకాడమిక్ పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం చాలడం లేదు. ఇక బయట దొరికే పుస్తకాలు చదివే వీలెక్కడిది?’ అని కొందరు ఉపాధ్యాయులు పెదవి విరిస్తే ఈ అభి్రపాయాన్ని మార్చేందుకు మధు ప్రకాశ్ ఓ పని చేశారు. జొనాథన్ హైడ్ రాసిన ‘ది ఆంక్షియస్ జనరేషన్’ అనే పుస్తకం గురించి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇతర టీచర్లకు ఆసక్తి కలిగించడంతో వారు ఆ పుస్తకం చదివేందుకు ముందుకొచ్చారు. స్టాన్లీ గ్రీన్ స్పాన్ రాసిన ‘ప్లేగ్రౌండ్ పాలిటిక్స్’ పుస్తకం చదవడం ద్వారా తాను బోధించే విధానం మారిందని వాణి అనే ఉపాధ్యాయిని చెప్పడంతో ఇతర టీచర్లకూ ఆ పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది. వర్జీనియా ఆక్స్లైన్ రాసిన ‘డిబ్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ సెల్ఫ్’, ఇ.ఆర్.బ్రెత్వెయిట్ రాసిన ‘టు సర్, విత్ లవ్’ పుస్తకాలు చదవడం వల్ల పిల్లలతో తాను ప్రవర్తించే విధానంగా సమూలంగా మారిందని ప్రతిమా అనే ఉపాధ్యాయిని వివరిస్తున్నారు.
→ ఎలాంటి పుస్తకాలు మేలు?
టీచర్ బుక్క్లబ్లో ఎలాంటి పుస్తకాలు చదవాలనేదానిపైనా కొందరు టీచర్లు సూచనలు చేస్తున్నారు. హెలెన్ కెల్లర్, ఐన్ స్టీన్, మేరీ క్యూరీ, అన్నా ఫ్రాంక్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్ వంటి మహనీయుల జీవితచరిత్రలతోపాటు సైన్స్, చరిత్ర, సాంస్కృతిక అంశాలపై పుస్తకాలకుప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. పాఠాల్లో ఉన్న అంశాలపై మరింత లోతైన సమాచారం అందించే పుస్తకాలనూ టీచర్లు చదువుతూ విద్యార్థుల చేత చదివిస్తున్నారు. బెంగళూరులో కొన్ని స్కూళ్లలో పాటిస్తున్న ఈ విధానం చూసి ఇతర స్కూళ్లలోనూ టీచర్స్ బుక్క్లబ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
టీచర్లు పాఠకులేనా?
టెట్సుకో కురొయానాగి రాసిన ‘టొటొ చాన్ ’ చదివితే పిల్లల సామర్థ్యాలేమిటో అర్థమయ్యాయి అంది ఒక ఉపాధ్యాయిని. స్టాన్లీ గ్రీన్స్పాన్ రాసిన ‘ప్లే గ్రౌండ్ పాలిటిక్స్’ చదివితే పిల్లల మధ్య అనుబంధాలు తెలిసొచ్చాయి అంది మరో ఉపాధ్యాయిని. ప్రభుత్వాలు పిల్లల చేత న్యూస్పేపర్లు చదివించే నిబంధనలను తెస్తున్నాయి.
కాని టీచర్లు పాఠకులుగా ఉంటున్నారా? టీచర్లు పుస్తకాలు చదివితే వృత్తి నైపుణ్యంతోపాటు పిల్లల వికాసం మరింత బాగుంటుందని బెంగళూరు టీచర్లు నిర్వహిస్తున్న
వాట్సప్ టీచర్స్ బుక్ క్లబ్స్ నిరూపిస్తున్నాయి. టీచర్లూ... ఏం చదువుతున్నారు?


