డెబై ఏళ్ల వయసులో ఆ బామ్మ పడుతున్న కష్టం చూస్తే మనసు కరిగిపోతుంది. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవంగా బతికేందుకు పడుతున్న తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్. ఎందుకమ్మా.. ఈ వయసులో నీకంత కష్టం అనిపిస్తుంది. కానీ ఆ బామ్మ తన కాళ్లపై తనునిలబడాలని పోరాడుతున్న తీరు యువతకు ఆదర్శం, స్ఫూర్తి కూడా. అందుకు సంబంధించిన వీడియోని ఆరాధన ఛటర్జీ షేర్ చేయడంతో నెటింట వైరల్గా మారింది.
ఆ బామ్మ పేరు దీపాలీ ఘోష్. తన భర్త మరణించిన తర్వాత దాదాపు మూడు దశాబ్దాలు ఓ చిన్న భోజనశాల నడుపుతోంది. ఆ భోజనశాలలో ప్రతీదీ ఆమెనే స్వయంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఆ హోటల్ సరిగా నడవడం లేదు. కనీసం ఐదు కస్టమర్లు కూడా లేరని భోరుమంటోంది. అది ఓ చిన్న ఇరుకైన స్థలంలో ఉన్న చిన్నపాటి భోజనశాల. అక్కడ ఓ విరిగిన ఫ్లైవుడ్పై నిద్రపోతుంది.
చెప్పాలంటే ఆ దుకాణం నిండా ఉన్న పాత సామాన్లు, మసితో నిండిన గోడలు, ఓ పక్క లీకయ్యే పైపుతో చిందరవందరగా ఉంది. బామ్మకు లాక్డౌన్ తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైందట. పైగా వినికిడి శక్తి తగ్గిపోయింది ఆ బామ్మకు. ఆమె తన ఆహారం, మందులు కోసం ఈ పని చేస్తూనే ఉండాలి. ఆమె వృద్ధాశ్రమానికి వెళ్లాలనుకోవడం లేదట. తాను గౌరవంగా జీవనోపాధిని పొందాలనేదే ఆమె ఆశ.
ఆ బామ్మ అక్కడే ఉండి తన వ్యాపారాన్ని ఇదివరకిటిలా రన్ చేయాలని తపన పడుతోంది. కాబట్టి మనమందరం కలిసి దీన్ని సాధ్యమయ్యేలా చేద్దామా అని పిలుపునిస్తూ..అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంది సోషల్ మీడియా యూజర్ ఆరాధన. ఆ వీడియో మిలియన్లమంది నెటిజన్ల మనసుని కదిలించింది. ఎలా ఆ బామ్మని కలిసేది, సాయం చేసేది అంటూ పోస్టలు పెట్టారు. మాలాంటి సోమరిపోతులకు నిజంగా ఆ బామ్మ కథ ఓ కనువిప్పు, ప్రేరణ అని భావోద్వేగంగా పోస్టులు పెట్టారు కూడా.
(చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్)


