
సొమ్ము భద్రం, భవితం స్వర్ణం అనుకుంటూ సాధారణ ప్రజలనుంచి గొప్ప గొప్పోళ్ల దాకా బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారు. కాయకష్టం చేసి, కడుపు మాడ్చుకుని మరీ పొదుపు చేసిన సొమ్మను ఎంతో విశ్వాసంతో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచుఫల్ ఫండ్స్ రూపంలో దాచుకుంటారు. తమ డబ్బు సురక్షితంగా ఉందని భావిస్తారు. బ్యాంకుల అభివృద్ధి, పెట్టుబడికి గట్టి సపోర్ట్ ఇస్తారు. కానీ బ్యాంకు వినియోగదారుల సొమ్మును అక్రమంగా వాడుకుంటూ కొంతమంది అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు వ్యవస్థకే చెడ్డపేరు తీసు కొస్తున్నారు. అంతేకాదు యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తాజా ఒక అధికారి నిర్వాకం గురించి తెలుసుకుంటే... షాక్ అవ్వక తప్పదు. నెట్టింట చర్చకు దారి తీసిన ఈ వివరాలను తెలుసుకుందాం రండి!
ఎన్డీటీ కథనం ప్రకారం రాజస్తాన్లోని కోటలోని ఒక బ్యాంకుకు చెందిన ఒక మహిళా అధికారి రూ. 4 కోట్లకు పైగా కస్టమర్లను మోసం చేసింది. ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్షి మేనేజర్గా పనిచేస్తున్న సాక్షి గుప్తా బ్యాంకు యూజర్ల FDల నుండి కోట్ల రూపాయలను తస్కరించింది. వీటిని స్టాక్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇలా రూ. 4.58 కోట్లు అక్రమాలకు పాల్పడింది. అంతేకాదు లావాదేవీల సందేశాల గురించి వారికి తెలియ కుండా ఉండటానికి , ఖాతాలతో లింక్ చేయబడిన కస్టమర్ల మొబైల్ నంబర్లను కూడా మార్చేసింది.
కస్టమర్లను ముంచేసి..తానూ ..
'యూజర్ FD (ఫిక్స్డ్ డిపాజిట్)' లింక్ను దుర్వినియోగం చేసి, 2020 - 2023 సంవత్సరాల మధ్య 41 మంది కస్టమర్ల 110 ఖాతాల నుండి రూ. 4.58 కోట్లు కొట్టేసింది. స్టాక్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ సొమ్ము ఆర్జించాలనే లక్ష్యంతో ఈ చర్యకు పూనుకుంది. రెండేళ్ల పాటు తన అక్రమాలు ఎవరి కంట కనపడకుండా కొనసాగించింది. దీంతో బ్యాంకు అధికారులెవరూ దీన్ని గమనించలేదు. అటు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో డబ్బును తిరిగి ఖాతాల్లో జమ చేలేకపోయింది. అలా అత్యాశకుపోయి, కస్టమర్లను ముంచేసి, తాను కూడా మునిగిపోయింది.
ఒక కస్టమర్ తన FD గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న బ్యాంక్ పోలీసులపై కేసు నమోదైంది. రంగంలోకి పోలీసులు గత రాత్రి ఆమె సోదరి వివాహంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఇదీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఈ ఖాతాలకు లింక్ చేసి రూ. 4 కోట్లకు పైగా విత్డ్రా చేసిందనీ, ఖాతాదారులకు తన పన్నాగం గురించి తెలియకుండా ఉండటానికి ఆమె తన సిస్టమ్లో OTP లను పొందడానికి ఉపయోగించే వ్యవస్థను కూడా రూపొందించిందని దర్యాప్తు అధికారి ఇబ్రహీం ఖాన్ అన్నారు. అయితే దీనిపై బ్యాంకు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ప్రభావితమైన కస్టమర్లకు నష్టాన్ని భర్తీ చేస్తామని బ్యాంకు వర్గాలు తెలిపాయి.
బ్యాంకులో మోసం గురించి తెలుసుకున్న తర్వాత, తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి కస్లమర్లు బ్యాంకుకు రావడం మొదలైంది."మన డబ్బు ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచుకోలేం, ఇప్పుడిక బ్యాంకులో ఉంచుకోలేం ఏమి చేయాలి?" అంటూ బ్యాంకు కస్టమర్ మహావీర్ ప్రసాద్ వాపోయారు.
చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!