సివిల్స్ లో ఆమె టాప్ | Girl bosses rule UPSC 2024: 5 women in top 10 | Sakshi
Sakshi News home page

సివిల్స్ లో ఆమె టాప్

Apr 23 2025 1:38 AM | Updated on Apr 23 2025 1:40 AM

Girl bosses rule UPSC 2024: 5 women in top 10

యు.పి.ఎస్‌.సి. నిర్వహించిన సివిల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ పరీక్షలో మహిళా అభ్యర్థులు 5 మంది టాప్‌ టెన్‌ లిస్ట్‌లో నిలిచారు. శక్తి దూబె (1), హర్షిత గోయల్‌ (2), షామార్గి చిరాగ్‌ (4), కోమల్‌ పునియా (6) ,ఆయుషి బన్సాల్‌ (7) ర్యాంకులు సాధించారు.

పాలకులు ఎవరైనా పరిపాలన అధికారుల చేతుల్లో ఉంటుంది. సమర్థులైన అధికారులే దేశాన్ని ముందుకు నడిపించగలరు. అందుకే ఎన్నో వడపోతలతో యు.పి.ఎస్‌.సి (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సి.ఎస్‌.ఇ) ఫలితాలు అభ్యర్థుల ప్రతిభకు అత్యున్నత ఆనవాలుగా నిలుస్తాయి. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్‌ పోస్టులతో పాటు ఐ.ఎఫ్‌.ఎస్‌. తదితర పౌర సేవల ఉన్నత స్థానాల భర్తీ ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. 

2024 సంవత్సరానికి ప్రభుత్వం 1129 సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల ఖాళీని గుర్తించగా వాటికోసం 5,83,599 మంది జూన్‌ 16, 2024న ప్రిలిమనరీ పరీక్ష రాశారు. వీరిలో14,627 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో 2,845 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా మొన్నటి జనవరి నుంచి ఈ నెల మొదటి వారం వరకూ సాగిన ఇంటర్వ్యూలలో 1009 మంది నియామకాలుపొందారు. వీరిలో 725 మంది పురుషులైతే 284 మంది స్త్రీలు. విశేషం ఏమిటంటే టాప్‌ 10 ర్యాంకుల్లో ఐదుమంది స్త్రీలు ఉండటం.... మొదటి ర్యాంకు మహిళా అభ్యర్థి సాధించడం. అందుకే ఇది అన్నివిధాలా స్త్రీలకు స్ఫూర్తినిచ్చే అంశం. వీరిలో టాప్‌టెన్‌లో నిలిచిన మహిళా ర్యాంకర్ల వివరాలు...

శక్తి దూబె 1వ ర్యాంక్‌
ప్రయాగ్‌రాజ్‌లో పుట్టి పెరిగిన శక్తి దూబె టెన్త్‌ క్లాస్‌లో టాపర్‌. అలహాబాద్‌లో బీఎస్సీ చదివితే అందులోనూ టాపర్‌గా నిలిచింది. తండ్రి ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తుంటే తల్లి గృహిణి. సివిల్స్‌ సాధించాలన్న కలతో కోచింగ్‌ కోసం ఢిల్లీ చేరినా కోవిడ్‌ వల్ల తిరిగి ఇంటికి వచ్చేయాల్సొచ్చింది. దాంతో ఇంట్లోనే ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యింది శక్తి దూబె. పోలిటికల్‌ సైన్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ను ప్రధానంగా ఎంచుకుని పరీక్ష రాసింది. దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది.

‘గత సంవత్సరం ఇంటర్వ్యూ వరకూ వెళ్లి వెనక్కు వచ్చాను. అప్పుడు నా సోదరుడు... ఏం బాధ పడకు.. ఇంకోసారి ప్రయత్నించు... మొదటి ర్యాంకు నీ కోసం వేచి చూస్తోంది అన్నాడు. అతని మాట నిజమైంది. కాని నేను ఇంత పెద్ద ర్యాంక్‌ వస్తుందని అనుకోలేదు’ అంది శక్తి దూబె. ‘సివిల్స్‌ కోసం అందరూ కృషి చేస్తారు. ఏ లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకుని కృషి చేస్తే గెలుస్తారు’ అందామె.

హర్షిత గోయల్‌ 2వ ర్యాంక్‌
హర్షిత గోయల్‌ స్వరాష్ట్రం హర్యాణ అయినా ఆమె ప్రస్తుతం వడోదరాలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ్రపాక్టీసు చేస్తోంది. తల్లి మరణించడంతో తండ్రి, సోదరుడితో కలిసి జీవిస్తున్న హర్షిత ‘నేను ఐ.ఏ.ఎస్‌ చేయాలనేది మా నాన్న కల. ఇవాళ ఆ కల నెరవేర్చాను. మా అమ్మ కూడా మబ్బుల్లో నుంచి సంతోషంగా ఉండే ఉంటుంది. 

ఇది నా మూడో అటెంప్ట్‌. నిరాశలో ఉండిపోకుండా ప్రయత్నించి సాధించాను. ఈ ర్యాంక్‌ సాధించడానికి రోజుకు కొన్ని గంటలు పెట్టుకొని చదవడం తప్ప వేరే ఏమీ చేయలేదు నేను. ఒక్కోసారి చదవాలనిపించదు. ఆ రోజు బ్రేక్‌ తీసుకున్నాను తప్ప బలవంతంగా చదవలేదు. నేను ఇన్‌స్టాలో ఉన్నాను. అయితే అది నా దృష్టి మరల్చలేదు. సోషల్‌ మీడియాను మీ చదువుకు ఉపయోగించుకుంటున్నారా కాలక్షేపానికా అనేది మీకు తెలిసి, కంట్రోల్‌లో ఉండగలిగితే సోషల్‌ మీడియా వాడండి’ అంది.

మార్గి చిరాగ్‌ షా  4వ ర్యాంక్‌
‘నాలుగుసార్లు విఫలమయ్యాను. ఐదోసారి నాల్గవ ర్యాంకు సాధించాను’ అంది మార్గి చిరాగ్‌ షా. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మార్గి కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లకుండా 2017 నుంచి సివిల్స్‌ కోసం పోరాడుతోంది. మధ్యలో తండ్రి మరణించినా ఆ దుఃఖాన్ని అధిగమించి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రిపరేషన్‌ వల్ల గుజరాత్‌ గ్రూప్‌ 1 పరీక్షల్లో ర్యాంక్‌ సాధించి ట్యాక్స్‌ అఫీసర్‌ అయ్యింది. అయితే ఐ.ఏ.ఎస్‌. కలను వదల్లేదు. ఇప్పటికి సాధించింది. ‘కొన్ని కోచింగ్‌ క్లాసెస్‌ విన్నాక సెల్ఫ్‌ స్టడీ బెటర్‌ అనుకున్నాను’ అందామె. ‘మీరు ఎంత బాగా ప్రిపేర్‌ అయినా పరీక్ష రాసే సమయంలో ప్రశాంత చిత్తం ముఖ్యం. అది లేకపోతే కష్టం’ అని తెలిపిందామె.

కోమల్‌ పునియా 6వ ర్యాంక్‌
32 ఏళ్ల కోమల్‌ పునియా ఐ.ఐ.టి. రూర్కీలో బి.టెక్‌ చేసింది. ఫిజిక్స్‌ అంటే చాలా ఇష్టం. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన కోమల్‌ చిన్నవూళ్ల నుంచి కూడా అమ్మాయిలు విజయం సాధించగలరు అని నిరూపించాలనుకుంది. తండ్రి రైతు కావడం వల్ల తన లక్ష్యానికి తానే మార్గనిర్దేశనం చేసుకుంది. గత సంవత్సరం ఆమెకు 474 ర్యాంకు వచ్చి ఐ.పి.ఎస్‌.కు ఎంపికైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రయినింగ్‌లో ఉంది. అయితే ఐ.ఏ.ఎస్‌. లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాసి ఈసారి ఏకంగా 6వ ర్యాంక్‌ సాధించింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే కాదు ఊళ్లో కూడా సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయుషీ బన్సాల్‌ 7వ ర్యాంక్‌
ఆయుషీ బన్సాల్‌ ఐ.ఐ.టి. కాన్పూర్‌లోబీటెక్‌ చేసింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో వెంటనే ఉద్యోగం వచ్చింది. అయితే సివిల్స్‌పై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి 2022 నుంచి ప్రిపరేషన్‌ మొదలుపెట్టింది. మొదటి అటెంప్ట్‌లోనే ఆమెకు 188వ ర్యాంకు వచ్చి ఐ.పి.ఎస్‌.కు ఎంపికై కర్నాటక కేడర్‌కు వెళ్లింది. 2023లో ఆమెకు 97వ ర్యాంక్‌ వచ్చింది. మూడోసారి ఇప్పుడు 7వ ర్యాంక్‌ సాధించి తన ఐ.ఏ.ఎస్‌ కలను నెరవేర్చింది.

అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే...
సివిల్స్‌లో మెరిసిన వరంగల్‌ వాసి
⇒ 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌
⇒ రెండో ప్రయత్నంలోనే  సత్తాచాటిన సాయి శివాని
⇒ గ్రూప్‌ వన్‌ లోనూ 21వ ర్యాంక్‌!

వరంగల్‌ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్‌సీ సివిల్స్‌లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్‌ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్‌ వన్‌ పరీక్షలోనూ జోనల్‌ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్‌ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ హోదా లేదా డీఎస్‌పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్‌ లో ఏకంగా 11వ ర్యాంక్‌ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత  ఉద్యోగాలకు  అర్హత సాధించగలిగారు.  

తల్లిదం్రడుల ప్రోత్సాహంతోనే...
‘నాన్న రాజు మెడికల్‌ రిప్రంజెటివ్‌గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్‌ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత  వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్‌ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. 

ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్‌ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువుకునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగాప్రోత్సహిస్తున్నారు. కుటుంబప్రోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్‌ మిస్‌ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్‌ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు.  

కఠోర సాధన చేసింది
తమ కుమార్తె సాయి శివాని కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలతో పాటు  ఢిల్లీలో ఉండే  సత్యం  జైన్‌ అనే వ్యక్తి నిర్వహించే అండర్‌  స్టాండింగ్‌ యూపీఎస్సీ ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్‌ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు,  రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా  కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు.  – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement