Telangana: Father Ends Life Hours After So Died In Road Accident At Asifabad - Sakshi
Sakshi News home page

సంతోషంగా నిశ్చితార్థం.. బంధువును దిగబెట్టి వస్తుండగా..  కొడుకు మృతితో తండ్రి ఆత్మహత్య 

Jun 16 2023 11:54 AM | Updated on Jun 16 2023 1:00 PM

Father Ends Life Hours After So Died In Road Accident At Asifabad - Sakshi

వాంకిడి(ఆసిఫాబాద్‌): ప్రేమించిన అమ్మాయిని మనువాడేందుకు పెద్దలను ఒప్పించాడు. సంతోషంగా నిశ్చితార్ధం చేసుకుని.. ఆ శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువును ఊళ్లో దిగబెట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇది తట్టుకోలేని అతని తండ్రి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనలు గురువారం కొమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వసాకే తులసీరాం(21) అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించగా, ఇరు కుటుంబాల అంగీకారంతో బుధవారం నిశ్చితార్థం జరిగింది.

దీనికి హాజరైన బంధువుల్లో ఒకరైన ఆసిఫాబాద్‌ మండలం ఎల్లారానికి చెందిన అంజన్నను గురువారం స్కూటీపై అతడి గ్రామంలో దింపి తులసీరాం ఇంటికి బయలుదేరాడు. బుదల్‌ఘాట్‌ వాగు దాటిన తర్వాత జైత్‌పూర్‌ రోడ్డు వద్ద కంకర క్రషర్‌ సమీపంలో జాతీయ రహదారి– 363పై వేగంగా వచి్చన డీబీఎల్‌ కంపెనీకి చెందిన టిప్పర్‌ స్కూటీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లారీ టైర్ల కింద స్కూటీ ఇరుక్కుపోగా తులసీరాం అక్కడికక్కడే మృతిచెందాడు.

కొడుకు మృతి తట్టుకోలేక: కుమారుడి మరణ వార్త విన్న తండ్రి భీంరావు(45) తీవ్ర మనస్తాపంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రీకుమారుల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వాంకిడి ఎస్సై సాగర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement