
బెంగళూరు: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో ఎఫైర్ పెట్టుకుని ఆపై బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న శ్రీదేవి రుదాగి అనే టీచర్.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. తన ఐదేళ్ల కూతుర్ని 2023లో బెంగళూరులోని ఓ స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి సతీష్(పేరు మార్చాం). అయితే అక్కడే అసలు కథ మొదలైంది. పాపను స్కూల్ కు తీసుకొచ్చి, తీసుకెళ్లే క్రమంలో అతనితో టీచర్ శ్రీదేవి సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఇలా ఇరువురి మధ్య ప్రారంభమైన వ్యవహారం కాస్తా ముదిరింది. ఈ క్రమంలోనే అతనితో సాన్నిహిత్యంగా ఉండటాన్ని సీక్రెట్ గా వీడియో రికార్డు చేసింది. అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. తనకు డబ్బులు కావాలంటూ పదే పదే వేధించసాగింది. కాలే, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టింది ఇలా మొత్తం మీద రూ. 4 లక్షల వరకూ లాగేసింది.
ఏకంగా ఇంటికి..
ఇక తనతో సాన్నిహిత్యం తగ్గించడంతో వ్యాపారి ఇంటికి వచ్చేసింది టీచర్ శ్రీదేవి. తనకు అప్పు కావాలనే వంకతో ఇంటికి వచ్చింది. అక్కడ రూ. 50 వేల అప్పు రూపంలో ఆమెకు ఇస్తున్నట్లు ఇంట్లో నమ్మించాడు సదరు వ్యాపారి. ఆ తర్వాత కూడా ఆమె నుంచి వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.
మకాం మార్చాడు..
ఇక ఆమె వేధింపులు అధికం కావడంతో గుజరాత్ కు మకాం మార్చాడు సదరు వ్యాపారి. అయితే తన ఐదేళ్ల కూతురు ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ కోసం మళ్లీ ఆమెను కలవాల్సి వచ్చింది. అలా ఆమె ఆఫీస్ లో చిక్కుపోయాడు వ్యాపారి. అక్కడ వీడియోలు, ఫోటోలు చూపిస్తూ రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది. ఒకవేళ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లకు వాటిని పంపిస్తానంటూ బెదిరించింది. అక్కడ కాలే, సాగర్ లు కూడా ఉండటంతో చివరకు చేసేది లేక బయటకొచ్చాడు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీదేవితో పాటు కాలే, సాగర్ లను కూడా అరెస్ట్ చేయగా,. ఆ ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.