ఏఐ వెనుక పరుగెత్తబోం! | Zoho CEO Sridhar Vembu Rejects AI Hype Bets on Deep Tech for Long Term Growth | Sakshi
Sakshi News home page

ఏఐ వెనుక పరుగెత్తబోం!

Jun 10 2026 1:12 PM | Updated on Jun 10 2026 2:10 PM

Zoho CEO Sridhar Vembu Rejects AI Hype Bets on Deep Tech for Long Term Growth

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ బూమ్‌పై దేశీయ టెక్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న ఏఐ హైప్ వెనుక పరుగెత్తే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు ఎగబడుతున్న రంగాలకు భిన్నంగా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే, ప్రస్తుతం అందరూ విస్మరిస్తున్న మెటలర్జీ వంటి డీప్ టెక్నాలజీ విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మార్కెట్ విశ్లేషకులు ముత్తుకృష్ణన్ దండపాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌పై శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఈ విశ్లేషణ చేశారు.

ప్రస్తుతం అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ చుట్టూ నెలకొన్న పెట్టుబడి ధోరణిని శ్రీధర్ వెంబు తీవ్రమైన ‘ఏఐ ఉన్మాదం’గా అభివర్ణించారు. ‘అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తున్నాయి. ఏఐ మౌలిక సదుపాయాలను సరఫరా చేసే కంపెనీలు ఈ వ్యయ చక్రం నుంచి తక్షణమే భారీ లాభాలను పొందుతున్నాయి. కొనుగోలుదారులు ఈ వ్యయాలను సుదీర్ఘ కాలానికి విస్తరించడం ద్వారా ప్రస్తుతానికి ఆదాయ వృద్ధిని, లాభదాయకతను కాపాడుకోగలుగుతున్నారు’ అని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) కొందరు భారతదేశం ఏఐ రేసులో వెనుకబడిందని భావిస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలను తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదని వెంబు స్పష్టం చేశారు.

మాకొద్దీ విధానం..

ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నమైన వైఖరిని తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జోహో అధినేత ప్రకటించారు. ‘మేము ఏఐలో జరుగుతున్న క్యాష్‌ బర్న్‌ను వెంబడించాలనుకోవడం లేదు. మార్కెట్ దృష్టిలో బోరింగ్‌గా కనిపించే, భారతదేశానికి అత్యంత కీలకమైన దీర్ఘకాలిక డీప్ టెక్ విభాగాల్లో పెట్టుబడి పెడుతున్నాం’ అని తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆయన మెటలర్జీ రంగాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ రంగానికి ఏఐకి వచ్చినంత పబ్లిసిటీ రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో దేశీయ ఉత్పాదక రంగానికి, వ్యూహాత్మక అభివృద్ధికి ఇది అత్యంత విలువైనదిగా మారబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

10-15 ఏళ్ల సుదీర్ఘ వ్యూహం

ఈ తరహా పెట్టుబడుల ఫలితాలు రాత్రికి రాత్రే రావని, తమ వ్యూహం విజయవంతం కావడానికి కనీసం 10 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుందని వెంబు అంగీకరించారు. తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మార్కెట్ ఫ్యాషన్లను, తాత్కాలిక హైప్‌లను అనుసరించరని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం జాతీయ అహంభావంతో తీసుకున్నది కాదని, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టించే రంగాలను గుర్తించడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు.

ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

Advertisement
 
Advertisement
Advertisement