ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ను కొన్ని సర్కిళ్లలో తొలగించింది. దీంతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కలిగిన ఎంట్రీ-లెవల్ ప్లాన్గా ఇప్పుడు రూ.349 ప్లాన్ నిలిచింది.
ఈ మార్పును పలు టెక్నాలజీ వెబ్సైట్లు గుర్తించగా, కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు కూడా రూ.299 ప్లాన్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ మార్పు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందా, లేక ఎంపిక చేసిన టెలికాం సర్కిళ్లకే పరిమితమా అనే విషయంపై ఎయిర్టెల్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇప్పటి వరకు రూ.299 ప్లాన్లో 28 రోజుల చెల్లుబాటు, రోజుకు 1GB హైస్పీడ్ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, హలోట్యూన్స్తో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో వంటి అదనపు ప్రయోజనాలు లభించేవి. ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో అదే తరహా వినియోగదారులు ఇప్పుడు రూ.349 ప్లాన్ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ.349 ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా ఆరు నెలల పాటు ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ హలోట్యూన్స్, అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం వంటి డిజిటల్ ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం రూ.399 ప్లాన్లో రోజుకు 2.5GB డేటాతో పాటు 28 రోజుల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఇదిలా ఉండగా, టిప్స్టర్ సంజూ చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్లాన్లు ఇంకా కొన్ని ఇతర సర్కిళ్లలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది.


