దేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించిన ఆదాయపు పన్ను రాయితీలను గణనీయంగా విస్తరించాలని ప్రతిపాదించింది. పెట్టుబడులు పెంచడం, తయారీ రంగానికి ఊతమివ్వడం, విదేశీ పెట్టుబడిదారులకు పన్ను పరమైన స్పష్టత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటి వరకు పరిమిత కాలానికే ఉద్దేశించిన పన్ను మినహాయింపులను ఇప్పుడు 15 ఏళ్లకు పొడిగించాలని ప్రతిపాదించారు. ఈ మార్పు ప్రకారం, విదేశీ కంపెనీలు భారతీయ కాంట్రాక్ట్ తయారీ సంస్థలకు యంత్రాలు, క్యాపిటల్ ఎక్విప్మెంట్, టూలింగ్ వంటి పరికరాలను అందించి, భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ చేపట్టే సందర్భంలో వచ్చే ఆదాయంపై 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పన్ను మినహాయింపు లభించనుంది. పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సంప్రదింపుల తర్వాత మొదట ప్రతిపాదించిన ఐదేళ్ల గడువును మరో పదేళ్లు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ రాయితీల పరిధిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, వాటి కీలక భాగాలు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. దీంతో దేశీయ తయారీ సంస్థలపై మూలధన భారం తగ్గడంతో పాటు, అంతర్జాతీయ బ్రాండ్లు భారత్లో మరింత విస్తృతంగా తయారీ కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇది మరింత బలాన్ని చేకూర్చనుంది.
అంతేకాదు, భారతీయ తయారీ యూనిట్లకు అవసరమైన విడిభాగాలను విదేశీ సంస్థలు సమీప గిడ్డంగుల్లో నిల్వ ఉంచినప్పుడు ప్రస్తుతం వర్తించే 2 శాతం పన్నును కూడా 15 ఏళ్లపాటు మినహాయించాలని బిల్లులో ప్రతిపాదించారు. దీని వల్ల సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు, ఉత్పత్తి ప్రక్రియలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు, గ్లోబల్ ఫండ్ మేనేజర్లను భారత్కు ఆకర్షించేందుకు కూడా ప్రభుత్వం కీలక మార్పులు ప్రతిపాదించింది. ప్రస్తుతం విదేశీ ఫండ్ మేనేజర్లు భారత్లో కార్యకలాపాలు నిర్వహించాలంటే అనేక నిబంధనలు పాటించాల్సి ఉండగా, వాటిలో ఎక్కువ భాగాన్ని తొలగించాలని బిల్లు సూచిస్తోంది. అయితే భారతీయ పెట్టుబడిదారులు ఈ నిబంధనలను దుర్వినియోగం చేయకుండా తగిన రక్షణ చర్యలు మాత్రం కొనసాగనున్నాయి. ఈ చర్యలతో భారత్ను అంతర్జాతీయ పెట్టుబడులకు మరింత అనుకూల గమ్యస్థానంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.


