
అదృష్టం ఎవరి జీవితంలో ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. 1990వ దశకంలో తన తండ్రి కొన్న షేర్లు ఇప్పుడు కొడుక్కి జీవితం మారిపోయే అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో తన తండ్రి కేవలం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన పాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ సర్టిఫికెట్లు అనుకోకుండా ఇటీవల కొడుక్కి దొరికాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని పదుల కోట్ల రూపాయలు.
రెడిట్లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘ఎక్స్’ పోస్ట్ లో వివరించారు. ‘ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లలో రూ.1లక్షకు కొన్న జేఎస్డబ్ల్యూ షేర్లను ఇటీవల కనుగొన్నాడు. ఇప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా.
ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండటంతో ఇప్పుడు ఒక తరానికే సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేస్తున్నాయి. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ ఈ పోస్ట్కు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు.. ఇది కేవలం పెట్టుబడి కాదు.. వారసత్వ సృష్టి.. అంటూ పలు విధాలుగా కామెంట్లు చేశారు.

జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీదారు. బలమైన మార్కెట్ ఉనికితో ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేరు ధర రూ.1004.90 వద్ద ఉండగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లుగా ఉంది. జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి.
👉ఇది చదివారా? జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడుల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరియర్ను ప్రారంభించిన యువత సేవింగ్స్పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్కు, ఇన్వెస్ట్మెంట్కు తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.