
పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనను పాటించకపోతే ఇకపై జరిమానా విధించబోమని కెనరా బ్యాంక్ ప్రకటించింది. జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం రెగ్యులర్, శాలరీ, ఎన్ఆర్ఐ ఖాతాలతో సహా అన్ని కేటగిరీల పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తిస్తుందని తెలిపింది.
ఈ నిర్ణయంతో కెనరా బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై పూర్తి మినహాయింపు అమలు చేసిన మొదటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. దీంతో ఈ బ్యాంక్ వినియోగదారులందరికీ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తుంది. ‘స్వేచ్ఛను అనుభవించండి. వ్యత్యాసాన్ని గుర్తించండి. జూన్ 1, 2025 నుంచి కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి జరిమానా విధించబోం’ అని బ్యాంక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈమేరకు పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..
గతంలో బ్యాంక్ ఖాతాదారులు పట్టణ బ్రాంచిల్లో రూ.2 వేలు, సెమీ అర్బన్ బ్రాంచిల్లో రూ.1,000, గ్రామీణ శాఖల్లో రూ.500 సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిర్వహించాల్సి ఉండేది. ఈ పరిమితులను చేరుకోవడంలో విఫలమైతే పెనాల్టీ ఛార్జీలు విధించేవారు. కొత్త విధానం ద్వారా ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించారు. బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.