
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగినట్లు వార్షిక నివేదికలో తెలిపారు. దాంతో ఆయన వేతనం రూ.80.6 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. ఆయన వేతనం పెరుగుదలకు ప్రధాన కారణం తనకు అనుసంధానించిన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూ), ఈక్విటీ విలువ పెరగడమేనని తెలిపింది.
2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్కు పోటీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో వంటి కంపెనీ సీఈఓల వేతనం కంటే కూడా సలీల్ ప్యాకేజీ అధికంగా ఉండడం గమనార్హం. దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారుగా ఉన్న టీసీఎస్ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతం పెరిగి రూ.26.5 కోట్లకు చేరుకుంది. విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పలియా వేతనం 10 శాతం పెరిగి 6.2 మిలియన్ డాలర్లకు లేదా సుమారు రూ.53.6 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ పారితోషికం రూ.71 కోట్ల నుంచి రూ.56 కోట్లకు తగ్గింది.
ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!
సలీల్ పరేఖ్ స్టాక్ ఆప్షన్ల ద్వారా రూ.49.5 కోట్లు ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.39 కోట్లుగా ఉంది. బేస్ పే కింద రూ.7.5 కోట్లు, రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.50 లక్షలు పొందారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.19.8 కోట్లుగా ఉన్న ఆయన వేరియబుల్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.23.2 కోట్లకు పెరిగింది. కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం రూ.10.72 లక్షలుగా ఉందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐ, క్లౌడ్, డేటా, డిజిటల్ రంగాల్లో ఇన్ఫోసిస్ అగ్రగామిగా ఉందని వాటాదారులకు రాసిన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ 15,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుందని, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 3,20,000 మందికి పైగా ఉద్యోగులున్నట్లు తెలిపారు.