దేశంలో ఇప్పటివరకు కేవలం పర్యావరణ సమస్యగా, పొలాల్లో తగులబెట్టే భారంగా చూసిన వ్యవసాయ వ్యర్థాలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త వాణిజ్య సరుకుగా (కమోడిటీ) రూపాంతరం చెందుతున్నాయి. భారత్లో ఏటా దాదాపు 50 నుంచి 55 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తవుతుండగా అందులో దాదాపు 23 కోట్ల టన్నుల మిగులు వ్యర్థాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే ఇవి దేశీయ గ్రామీణ ఆర్థిక రంగానికి జీవనాడిలా మారే అవకాశం ఉంది.
వరి గడ్డి, చెరకు పిప్పి, పత్తి కట్టెలు, గోధుమ వ్యర్థాలను బయో-ఎనర్జీగా మార్చడం ద్వారా భారత్ ఇంధన భద్రతలో విప్లవాత్మక మార్పులు సాధించవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ.23,731 కోట్ల గోబర్ధన్ (GOBARdhan) పథకం, కంప్రెస్డ్ బయో గ్యాస్ విభాగంలో గేమ్ఛేంజర్గా నిలవనుంది. సీఎన్జీ రవాణా ఇంధనంలో 2028-29 నాటికి 5% కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) కలపడం నిర్బంధం చేయడంతో శిలాజ ఇంధనాల దిగుమతి భారం తగ్గి దేశీయంగా స్వచ్ఛమైన శక్తి లభ్యత పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
రైతు రాబడికి అదనపు ఊతం
గతంలో పొలాల్లో గడ్డి తగులబెట్టడం వల్ల తీవ్ర వాయు కాలుష్యంతో పాటు నేల రసాయన సారం దెబ్బతినేది. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పంట వ్యర్థాలను పారిశ్రామిక అవసరాలకు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అలాగే, బయోగ్యాస్ తయారీలో బై-ప్రొడక్ట్గా వచ్చే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మ్యాన్యూర్(ఎఫ్ఓఎం) వంటి సేంద్రీయ ఎరువులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల సారవంతాన్ని పునరుద్ధరిస్తున్నాయి.
మార్కెట్ సంస్కరణలే కీలకం
అంతర్జాతీయంగా 2023-2030 మధ్య పెరిగే బయో-ఎనర్జీ డిమాండ్లో భారత్ వాటా ఏకంగా 35 శాతంగా ఉంటుందని అంచనా. అయితే, పంట కోతల సమయంలో వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, తేమ నియంత్రణ, అధునాతన నిల్వ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే ఈ రంగం పూర్తిస్థాయి గోల్డ్ మైన్గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు


