ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ముంబైలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు కొనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ (FCFS) పథకం కింద అందుబాటులో ఉన్న 24 అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఎస్బీఐ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ నుంచి లేఖ అందినట్లు ఎంహెచ్ఏడీఏ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై తదుపరి దశలో బ్యాంకుతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
2026లో ఎంహెచ్ఏడీఏ ముంబై బోర్డు ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలో మొదట 118 ఇళ్లను విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో నిర్వహించిన లాటరీల్లో విక్రయంకాని లేదా వివిధ కారణాలతో మిగిలిపోయిన ఇళ్లను ఈ విధానంలో విక్రయానికి పెట్టింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ విక్రయ ప్రక్రియలో మార్చి నాటికి 64 ఇళ్లు విక్రయమైనట్లు నివేదికలు వెల్లడించాయి. మిగిలిన వాటిలో అధిక ధర కలిగిన ఫ్లాట్లు కూడా ఉన్నాయి.
ఎస్బీఐ ఎందుకు కొనాలనుకుంటోంది?
ఎస్బీఐ 24 ఫ్లాట్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన వెనుక ఉద్దేశం, వాటి వినియోగం, ఎంపిక చేసిన ఫ్లాట్ల ధరలు వంటి వివరాలను ఎంహెచ్ఏడీఏ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, ఎస్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ దశలోనే ఈ ప్రక్రియ ఉంది. కొనుగోలు ఇంకా ఖరారు కాలేదు.
మరోవైపు, ఎంహెచ్ఏడీఏ 2026లో ముంబైలో గృహ విక్రయ కార్యక్రమాలను విస్తరించింది. ఏప్రిల్లో ముంబై బోర్డు 2,640 ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించింది. అలాగే వేర్వేరు ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన ఇళ్లను ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలో విక్రయించే కార్యక్రమాలను కూడా చేపడుతోంది.


