రైలు ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే కఠిన చర్యలు చేపట్టింది. గత మూడేళ్ల కాలంలో ఆహార నాణ్యత, పారిశుధ్య నిబంధనలను ఉల్లంఘించిన క్యాటరింగ్ లైసెన్సీలపై రైల్వే శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని సంస్థలపై రూ.5.13 కోట్ల మేర జరిమానాలు విధించడంతోపాటు ఆరు ప్రధాన కాంట్రాక్టులను రద్దు చేసి, సదరు కాంట్రాక్టర్లను డీబార్ (బ్లాక్లిస్ట్) చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు.
మంత్రి అందించిన సమాచారం ప్రకారం.. గత మూడేళ్లలో ఆహార లోపాలపై 54 షోకాజ్ నోటీసులు జారీ చేశామని, డీబార్ చేసిన లైసెన్సీల జాబితాను ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో ప్రచురించామని తెలిపారు. భారతీయ రైల్వేలు ఏటా సగటున 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తుండగా ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు కేవలం 0.0008 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఫిర్యాదుల శాతం అత్యల్పంగా ఉన్నప్పటికీ ప్రయాణికుల ఆరోగ్య భద్రత విషయంలో జోరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆహార భద్రతకై సంస్కరణలు
ఆధునిక సాంకేతికతతో కూడిన బేస్ కిచెన్లను ఏర్పాటు చేసి వంట తయారీ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
ప్రయాణికులకు ఇచ్చే మీల్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నారు. దీని ద్వారా ప్యాకింగ్ తేదీ, కాంట్రాక్టర్ వివరాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ను ప్రయాణికులు స్వయంగా పరిశీలించవచ్చు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఐఆర్సీటీసీ సూపర్వైజర్లచే తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన బ్రాండెడ్ ముడిసరుకుల వినియోగం, బేస్ కిచెన్లు, పాంట్రీ కార్లలో రెగ్యులర్ పెస్ట్ కంట్రోల్ (క్రిమిసంహారక) చర్యలను తప్పనిసరి చేశారు.


