అదనపు లగేజ్ కోసం.. రైల్వే కొత్త రూల్! | Railway Passengers To Get Online Excess Baggage Booking Option From July 31 | Sakshi
Sakshi News home page

అదనపు లగేజ్ కోసం.. రైల్వే కొత్త రూల్!

Jul 23 2026 4:11 PM | Updated on Jul 23 2026 4:33 PM

Railway Passengers To Get Online Excess Baggage Booking Option From July 31

ట్రైన్ జర్నీ చేసేవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్లాలంటే ప్రయాణికులు రైల్వే పార్సిల్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా కావడంతో పాటు, ప్రయాణానికి ముందు అనవసర ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ రైల్వే కొత్త నిర్ణయం తీసుకుంది.

భారతీయ రైల్వే 2026 జూలై 31 నుంచి టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే.. అదనపు లగేజ్ కోసం కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా సులభమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.

లగేజ్ లిమిట్ ఇలా..
ప్రస్తుతం ప్రయాణికుడు ప్రయాణించే క్లాస్ ఆధారంగా ఉచితంగా తీసుకెళ్లే లగేజీకి లిమిట్ ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోలు.. ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్‌లో 50 కిలోలు.. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్, స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి సామాను తీసుకెళ్లాలనుకుంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే.. అన్ని కోచ్‌లకు ఒకే విధమైన నిబంధనలు ఉండవు. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్‌లో ఉచిత పరిమితి, గరిష్ఠ పరిమితి రెండూ ఒకటే కావడంతో ఈ తరగతుల్లో అదనపు లగేజ్ బుకింగ్‌కు అనుమతి ఉండదు. మిగతా తరగతుల్లో మాత్రం నిర్ణయించిన గరిష్ఠ పరిమితి వరకు అదనపు లగేజీని బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సాధారణ లగేజ్ ఛార్జీ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించాలి.

జరిగిమానా
ప్రయాణికులు మరో విషయం కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. అనుమతించిన బరువుకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లి, దానికి సరైన బుకింగ్ చేయకపోతే ప్రయాణ సమయంలో లేదా గమ్యస్థానంలో తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే లగేజీని బుక్ చేసుకోవడం మంచిది.

బరువుతో పాటు సామాను పరిమాణంపై కూడా రైల్వే నిబంధనలు అమలు చేస్తోంది. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్‌లో చిన్న పరిమాణం ఉన్న బ్యాగులకే అనుమతి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, స్లీపర్, జనరల్ కోచ్‌లలో కొంచెం పెద్ద సైజు బ్యాగులను తీసుకెళ్లవచ్చు. నిర్ణయించిన పరిమాణాన్ని మించిన సామానును కోచ్‌లోకి అనుమతించరు. అలాంటి లగేజీని ప్రత్యేకంగా లగేజ్ లేదా పార్సిల్ వ్యాన్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది.

పార్సిల్ ద్వారా ఎక్కువ బరువున్న వస్తువులను కూడా పంపించుకునే అవకాశం ఉంది. అయితే మీరు ప్రయాణించే తరగతిని బట్టి గరిష్ఠ బరువు పరిమితి మారుతుంది. లగేజ్ ఛార్జీలు ప్రయాణ దూరం, బరువు, రైలు సేవలను బట్టి నిర్ణయిస్తారు. కనీస ఛార్జీ రూ.30గా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త విధానం రైలు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: స్కూల్‌లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement