
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అంటే ఖరీదైన హార్డ్వేర్ లేకుండా యూజర్లు తమ మొబైల్, పీసీ, జియో సెట్-టాప్ బాక్స్లో కన్సోల్ లాంటి గేమ్స్ను ఆస్వాదించగలరు. ఈ ప్లాన్లు రూ.48 నుంచి ప్రారంభమవుతాయి.
ఏమిటీ జియోగేమ్స్ క్లౌడ్?
ఇది క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్. దీని ద్వారా యూజర్లు గేమ్ను డౌన్లోడ్ చేయకుండా నేరుగా ఆన్లైన్లో ఆడవచ్చు. సాధారణంగా దీని సబ్ స్క్రిప్షన్ రూ.398. కానీ కొత్త ప్లాన్లలో ఈ సదుపాయాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.
జియో కొత్త గేమింగ్ ప్లాన్స్ ఇవే..
రూ.48 ప్లాన్: ఇది గేమింగ్ ప్రయత్నించాలనుకునే స్వల్పకాలిక వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ 10 ఎంబీ డేటా, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ ను 3 రోజుల పాటు అందిస్తుంది.
రూ.98 ప్లాన్: ఈ ప్లాన్తో 7 రోజుల పాటు 10 ఎంబీ డేటా, గేమింగ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీనిని ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.
రూ.298 ప్లాన్: జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ తో పాటు 3 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇది కూడా డేటా వోచర్. యాక్టివ్ ప్లాన్ తో మాత్రమే ఉపయోగించవచ్చు.
రూ.495 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్స్టార్ మొబైల్), ఫ్యాన్కోడ్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
రూ.545 ప్లాన్: ఇది అత్యంత ప్రీమియం ప్లాన్. 2 జీబీ రోజువారీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత 5 జీ డేటా ఇందులో లభిస్తాయి. మిగతా ఫీచర్లన్నీ రూ.495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి.