జీడీపీ వృద్ధికి సవాళ్లు..! | RBI Warns of GDP Growth Risks Iran-US Deal Weak Monsoon India Economy | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

Jun 23 2026 7:56 AM | Updated on Jun 23 2026 10:45 AM

RBI Warns of GDP Growth Risks Iran-US Deal Weak Monsoon India Economy

ముంబై: అమెరికా–ఇరాన్‌ మధ్య ఒప్పందం విఫలమైనా, నైరుతి రుతుపవనాలు బలహీన పనితీరు చూపించినా భారత ఆర్థిక వ్యవస్థ... వృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్‌బీఐ తాజా బులెటిన్‌ పేర్కొంది. పశ్చిమాసియాకు సంబంధించి మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాలు కొనసాగుతున్నట్టు ప్రస్తావించింది.

అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. పపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ ఒప్పందం విచ్ఛిన్నం అయితే తిరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. కీలకమైన ఇంధన సరఫరాల్లో సమస్యలు, పెట్టుబడుల వ్యయాలు నిదానించడం, ఆహార భద్రత ఆందోళనలు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని, వృద్ధి తగ్గిపోతుంది’’అని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో చివరి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందంటూ.. ప్రైవేటు వినియోగం, స్థిర పెట్టుబడులు ఇందుకు మద్దతునిచ్చినట్టు వివరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనూ (ఏప్రిల్, మే) ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయని ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగినప్పటికీ, అది నియంత్రిత శ్రేణిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. విదేశీ వాణిజ్యం, చెల్లింపుల స్థితులు బలంగానే ఉన్నాయని వెల్లడించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), తగినంత విదేశీ మారకం నిల్వలు మద్దతుగా నిలిచినట్టు పేర్కొంది.  

ఎదుర్కొనే స్థితిలో.. 
ఇతర దేశాలతో పోల్చి చూస్తే.. బలమైన ఆర్థిక మూలాలతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలవగలదని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. ఎల్‌పీజీ ధరలు పెంచినందున అది రెస్టారెంట్ల సేవలపై ప్రభావం చూపించి, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేసింది. జూన్‌ 18 నాటికి ఉన్న డేటా ప్రకారం ఆహార ధరల్లో పెరుగుదల కొనసాగుతున్నట్టు తెలిపింది. బియ్యం, గోధుమలు, ప్రధాన పప్పుల ధరలు పెరిగినట్టు వెల్లడించింది. అలాగే, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, నూనెల ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలతో భారత క్రూడ్‌ బాస్కెట్‌ ధరలు గరిష్టాల్లోనే ఉన్నట్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement