
గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు జోరు చూపడం పలువురు ఇన్వెస్టర్లకు జోష్నిచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈలో నికరంగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా జమయ్యాయి. వెరసి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.92 కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా మార్కెట్లు జోరందుకోవడానికితోడు డిజిటల్ బ్రోకరేజీ సంస్థలు దోహదం చేశాయి.
కొత్తగా జత కలిసిన ఖాతాలలో గ్రో, ఏంజెల్ వన్ నుంచే 57 శాతం నమోదయ్యాయి. 34 లక్షల డీమ్యాట్ ఖాతాలు గ్రో నుంచి ఓపెన్కాగా.. ఏంజెల్ వన్ నుంచి 14.6 లక్షల ఖాతాలు జమయ్యాయి. అంటే 84 లక్షల కొత్త ఖాతాలలో ఈ రెండు సంస్థల నుంచే 48.6 లక్షల ఖాతాలు జత కలిశాయి. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరో బ్రోకింగ్ సంస్థ జిరోధా నుంచి 5.4 లక్షల ఖాతాలు తెరిచినట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి.
మొబైల్ ఆధారిత సరళీకృత లావాదేవీల కారణంగా ఇన్వెస్టర్లు డిజిటల్ బ్రోకరేజీలను ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఇన్వెస్టర్లు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా లావాదేవీలకు ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు.