ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.
మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.
ప్రైవేట్ చాట్స్ లీక్
ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్క్రిప్షన్లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్ను ఆపేసింది. అయితే.. ఈ లీక్పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.
ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం
నిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు!


