భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసి చాలా కాలమైంది. ఈ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని వాహనదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఫ్యూయెల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?, అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరణ ఇచ్చింది.
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నేరుగా నిర్ణయించదని, ఇవి మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలను నిర్ణయిస్తాయని కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు.
ధరల్లో వచ్చిన మార్పులు!
2021 జూన్ నుంచి 2026 జూన్ వరకు అంతర్జాతీయంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే.. ఇతర దేశాల్లోని ధరలతో పోలిస్తే, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ కాలంలో (2021-26) ఢిల్లీలో పెట్రోల్ ధర 8.1 శాతం, డీజిల్ ధర 11.5 శాతం మాత్రమే పెరిగింది. అమెరికాలో పెట్రోల్ ధర 70.6 శాతం, ఫ్రాన్స్లో 59.9 శాతం, జర్మనీలో 51.1 శాతం, బ్రిటన్లో 46.9 శాతం పెరిగింది.
ఇక పక్క దేశాల విషయానికి వస్తే.. పాకిస్థాన్లో పెట్రోల్ ధర 160.6 శాతం, శ్రీలంకలో 148.6 శాతం, నేపాల్లో 76 శాతం పెరిగింది. డీజిల్ ధరలు కూడా ఈ దేశాల్లో భారీగా పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.
పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 2026 ఫిబ్రవరిలో భారతదేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు 69 డాలర్లు ఉండగా, మార్చిలో అది 136.68 డాలర్లకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. చమురు ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
నష్టం భరించిన ప్రభుత్వం
ఇలాంటి పరిస్థితుల్లో.. మొత్తం భారాన్ని వినియోగదారులపై వేయకుండా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కొంత నష్టాన్ని భరించాయని ప్రభుత్వం తెలిపింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నష్టాలను చవిచూశాయని వెల్లడించింది. ముఖ్యంగా హిందుస్తాన్ పెట్రోలియంకు రూ.11,526 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. అయితే.. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం కూడా తగ్గింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి తగ్గించే కొత్త నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు.
అందుకే చమురు ధరల్లో వ్యత్యాసం!
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని, నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్ర పన్నులు, స్థానిక పన్నులు. ఉదాహరణకు.. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.12 ఉండగా, బెంగళూరులో అది రూ.111.37గా ఉంది. ముంబైలో కూడా పెట్రోల్ ధర రూ.111 కంటే ఎక్కువగా ఉంది.
యుద్ధం మొదలైన తర్వాత.. భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని సార్లు పెరిగాయి. ఏప్రిల్ నెలలో ఒకసారి.. ఆ తర్వాత మే నెలలో కూడా ధరలు పెరిగాయి.
దీన్నిబట్టి చూస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ప్రభుత్వం నిర్ణయించడం వల్ల మాత్రమే మారవు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, యుద్ధాలు, మార్కెట్ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర పన్నులు వంటి అనేక కారణాలు వీటి ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవచ్చు. ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై భారం తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.
ఇదీ చదవండి: 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు!


