
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.
వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.
మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.