నష్టాల్లోకి వెళ్లడానికే రిస్క్‌ తీసుకుంటున్న మదుపర్లు! | Investors Who Are Taking The Risk Of Going Into Losses | Sakshi
Sakshi News home page

నష్టాల్లోకి వెళ్లడానికే రిస్క్‌ తీసుకుంటున్న మదుపర్లు!

Oct 31 2023 5:08 PM | Updated on Oct 31 2023 6:32 PM

 Investors Who Are Taking The Risk Of Going Into Losses - Sakshi

స్టాక్‌మార్కెట్‌ మదుపర్లు కొన్నిసార్లు నష్టపోతుంటారు. ఇంకొన్నిసార్లు లాభాల్లో ఉంటారు. కానీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్లే స్టాక్‌లను మాత్రం వెంటనే అ‍మ్ముతుంటారు. నష్టాల్లో ఉన్న స్టాక్‌లను మాత్రం ఎప్పటికైనా లాభాల్లోకి రాకపోతుందా అని అట్టే పెట్టుకుంటారు.  అలా తాత్కాలికంగా నష్టాలు వచ్చే వాటిల్లో బలమైన ఫండమెంటల్స్‌ ఉన్న కంపెనీలు ఉంటే ఫరవాలేదు. కానీ సరైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకుండా నష్టాలను పోస్ట్‌ చేస్తున్న కంపెనీలకు చెందిన స్టాక్‌లను కూడా అలాగే ఉంచుకోవడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత 50 సంవత్సరాలుగా మార్కెట్‌ను గమనిస్తున్న ఆర్థికవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. వారు ప్రతిపాదించిన యుటిలిటీ థియరీ ప్రకారం..మదుపర్లు వివిధ స్వభావాలు కలిగి ఉంటారు. రిస్క్‌ తీసుకుని కొందరు లాభాల్లోకి వెళితే, మరికొందరు అదే రిస్క్‌ తీసుకుని  నష్టాల్లోకి వెళ్తున్నారు. మొదటి నియమంతో మంచి కంపెనీలు మదుపు చేయడం వల్ల లాభాల్లోకి వెళ్లవచ్చు.

ఇదీ చదవండి: బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా

కానీ రెండో నియమం ప్రకారం రిస్క్‌ తీసుకున్నా నష్టాల్లోకి వెళ్లడం ఏమిటనే అనుమానం ఉంటుంది. అయితే కంపెనీపై సరైన అవగాహన, దానికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేయకుండా మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి కొందరు నష్టాల్లోకి జారుకుంటారు. కొద్దిగా నష్టాలు ఉన్నపుడు స్టాక్‌లను అమ్మకుండా రిస్క్‌ తీసుకుని వాటిని అలాగే తమ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకుంటారు. ఫలితంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా మరింత నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. మదుపు చేసేముందు కంపెనీ పూర్వాపరాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ, ఫలానా రంగంలోని పోటీలో ఉన్న సంస్థలు, ముడిసరుకు, మార్కెటింగ్‌, కంపెనీ అప్పులు తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement