
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికానికి (Q1 FY2025-26) సంబంధించిన పనితీరు బోనస్ లెటర్లను జారీ చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉండటంతో ఉద్యోగులకు కూడా మెరుగైన బోనస్ను ప్రకటించింది.
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80% పనితీరు బోనస్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65% సగటు బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన ఈ బోనస్ ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందనుంది.
ఉద్యోగులు తమ పనితీరు రేటింగ్ ఆధారంగా 75% నుండి 89%వరకు బోనస్ పొందారు. ఈ బోనస్ చెల్లింపు లెవెల్ 4, 5, 6 స్థాయిల్లో ఉన్న (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు) 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులను కవర్ చేస్తుంది. పనితీరు విషయంలో ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించి బోనస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలు సాధించింది. రూ.6,921 కోట్ల నికర లాభం (వార్షిక ప్రాతిపదికన 8.7% వృద్ధి), రూ.42,279 కోట్ల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన 7.5% వృద్ధి) నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను అధిగమించింది.
ఇదీ చదవండి: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్