టికెట్ లేకుండా లేదా చెల్లుబాటు కాని టికెట్తో ప్రయాణించే ప్రయాణికులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైంది. జన్ విశ్వాస్ చట్టం ప్రకారం కొత్త రూల్స్ జులై 1నుంచి అమల్లోకి రానున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.
కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.
అంతేకాకుండా.. టికెట్లో పేర్కొన్న కోచ్ లేదా క్లాస్ కాకుండా ఇతర కోచ్లో ప్రయాణిస్తే కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనరల్ టికెట్తో స్లీపర్ లేదా ఏసీ కోచ్లో ప్రయాణించడం, లేదా అనుమతించిన దూరం (దిగాల్సిన స్టేషన్) కంటే ఎక్కువ ప్రయాణించడం వంటి వాటిపై కూడా అదనపు చార్జీలు విధిస్తారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతరుల టికెట్ను ఉపయోగించి ప్రయాణించడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇలా ప్రయాణిస్తే.. టికెట్ రద్దు చేయడమే కాకుండా, రూ.500 జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ ప్రయాణికుడు ఈ జరిమానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే అధికారులు కోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలు వసూలు చేయడం జరుగుతుంది.
ఇదీ చదవండి: అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!
ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే వంటి విభాగాలు సోషల్ మీడియా, ఇతర ప్రకటనల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. సరైన టికెట్తో మాత్రమే ప్రయాణించాలని, రైల్వే నియమాలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాయి.


