దశల వారీగా ఉపసంహరణపై కేంద్రం కసరత్తు
ఎల్పీజీ, సహజవాయువు నియంత్రణలపై సమీక్ష
అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంతో భారత్కు భారీ ఊరట
హార్మూజ్ జలసంధిలో నౌకాయాన పునరుద్ధరణతో తగ్గిన సరఫరా భయాలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ రక్షణ కోసం అమలు చేసిన ‘ఇంధన అత్యవసర’ ఆంక్షలను అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా ఉపసంహరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య 111 రోజుల యుద్ధానికి ముగింపు పలికే మధ్యంతర ఒప్పందం కుదిరింది. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి ద్వారా నౌకాయాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రానుండటం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారతదేశానికి భారీ ఊరటనిచ్చే అంశం.
ముందస్తు రక్షణ చర్యలుగా ఆంక్షలు
ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడి చమురు ధరలు, షిప్పింగ్ భీమా ప్రీమియంలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పలు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా...
ఎల్పీజీ సరఫరాలపై నిఘా పెంచింది. సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడే గ్యాస్ను ఎల్పీజీ వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది.
హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో పాటు, గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచి నిల్వలను నియంత్రించింది.
గృహ అవసరాలు, రవాణా (సీఎన్జీ), ఎరువుల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సహజ వాయువు కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసింది.
‘‘ఈ ఆంక్షలన్నీ కేవలం ముందస్తు నివారణా చర్యలే. అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడి, సరఫరా ముప్పు తొలగిపోగానే ఈ ఆంక్షలను దశలవారీగా ఉపసంహరిస్తాం’’ అని అధికారి స్పష్టం చేశారు.
చమురు కంపెనీలకు రోజూ రూ.550 కోట్ల నష్టం
యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 70–72 ডy్థయి నుంచి గరిష్టంగా 119 డాలర్లకు చేరుకున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు పెరగకుండా నియంత్రించింది. మార్చి 27న పశి్చమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మేర పెంచింది.
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రెండు విడతల్లో మొత్తం రూ.89 పెంపు అమలు చేసింది. ఈ ధరల పెంపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ రిటైల్ ఇంధన ధరలు ఇంకా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికీ రోజుకు సుమారు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు నెలల కనిష్టానికి పతనమమయ్యాయి. గురువారం బ్యారెల్ ధర సుమారు 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


