
ఆరేళ్లలో సాధిస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ
9 శాతానికి తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుతం నికర ఇంధన దిగుమతిదారుగా ఉండగా, వచ్చే ఆరేళ్లలో నికర ఎగుమతిదారుగా అవతరిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా పేర్కొన్నారు. ఇధనాల్, బయోడీజిల్ తదితర బయో ఇంధనాలు, హైడ్రోజన్తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ అనుకూల ఇంధనాలకు మారడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, లాజిస్టిక్స్ వ్యయాలు కూడా దిగొస్తాయని మంత్రి చెప్పారు.
అదే సమయంలో కొత్త రహదారుల నిర్మాణం వల్ల ఇంధన వ్యయాలు, లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు ఈ ఏడాది చివరికి 9 శాతానికి దిగిరానున్నట్టు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు ఆరు శాతం మేర తగ్గాయన్న ఒక సర్వే ఫలితాలను ప్రస్తావించారు. ‘‘నేడు చైనాలో లాజిస్టిక్స్ వ్యయాలు జీడీపీలో 8 శాతంగా ఉన్నాయి. అమెరికాలో, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉన్నాయి. అదే భారత్లో 16 శాతంగా ఉన్నాయి’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభసాటి అయిన బయో ఇంధనాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ.. ఎగుమతులను పెంచుకోవడం కోసం రవాణా వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.