How India Borrows 2024: ఆన్‌లైన్‌ రుణం.. యస్‌ బాస్‌ | How India Borrows 2024: Loans for smartphones and home appliances now dominate consumer finance in India | Sakshi
Sakshi News home page

How India Borrows 2024: ఆన్‌లైన్‌ రుణం.. యస్‌ బాస్‌

Oct 20 2024 12:39 AM | Updated on Oct 20 2024 12:39 AM

How India Borrows 2024: Loans for smartphones and home appliances now dominate consumer finance in India

రుణంతో కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ 

స్మార్ట్‌ఫోన్లు, గృహ నవీకరణకూ ఇదే మార్గం 

యాప్‌ బ్యాంకింగ్, ఈఎంఐ కార్డులకు మొగ్గు 

వినియోగ ధోరణులపై హోమ్‌ క్రెడిట్‌ ఇండియా సర్వే 

హైదరాబాద్‌: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు.

 యాప్‌ ఆధారిత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్‌ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్‌ క్రెడిట్‌ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్‌ సర్వే ‘హౌ ఇండియా బారోస్‌’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్‌ క్రెడిట్‌ ఇండియా విడుదల చేసింది.  

వేటి కోసం రుణాలు.. 
కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్‌లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. 

వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. 

అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది.

 ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది.  


వాట్సాప్, చాట్‌బాట్‌ పాత్ర 
27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్‌బాట్‌ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్‌ జెడ్‌లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్‌ సేవల కోసం చాట్‌బాట్‌లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్‌ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్‌ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. 

ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్‌ ఫైనాన్స్‌ (డిజిటల్‌ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్‌ షాపింగ్‌ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్‌ బుకింగ్‌ యాప్‌లు మేక్‌మైట్రిప్,  క్లియర్‌ట్రిప్, 23 శాతం ఫుడ్‌ డెలివరీ  యాప్‌లు జొమాటో, స్విగ్గీ సేవలను  వినియోగించుకుంటున్నారు.

పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలు.. 
వినియోగదారులు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్‌ ఆధారిత బ్యాంకింగ్‌ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్‌ ఆధారిత బ్యాంకింగ్‌కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్‌లో 69 శాతం మంది యాప్‌ ఆధారిత బ్యాంకింగ్‌కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్‌ జెడ్‌లో 65 శాతం మంది, జెన్‌ ఎక్స్‌లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు.

 మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్‌డౌన్‌లతో 2021లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 64 శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 71 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement