
ఆఫర్ లెటర్ అనేది ఉద్యోగ ఎంపికలో కీలక దశ. స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయి ఆఫర్ లెటర్ చేతికొచ్చేసిందంటే ఇక ఉద్యోగం ఖరారైపోయిందని అభ్యర్థులు ఆనందంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడో అభ్యర్థి..
ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోని అబుదాబిలోని ఓ కంపెనీపై స్థానిక కోర్టు తగిన చర్యలు తీసుకుంది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సదరు బాధిత ఉద్యోగికి 'బకాయి వేతనం'గా 1,10,400 దిర్హమ్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.25 లక్షలు
చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని యజమానులు నిలిపివేశారని ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కంపెనీపై దావా వేశారు.
ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్ల ప్యాకేజీ ఇస్తామని ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. కానీ అతని జాయినింగ్ తేదీని కంపెనీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతం కూడా ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగి కంపెనీని కోర్టుకు లాగాడు.
కోర్టు ఏం చెప్పిందంటే..
వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్యోగి విధుల్లో చేరిక జాప్యానికి కంపెనీ యాజమాన్యమే కారణమని స్పష్టమైందని కోర్టు పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
మరోవైపు, సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యాడన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరిక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా తాను ఎనిమిది రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు.