
హైదరాబాద్: సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నగరంలో భారీ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఈ-మొబిలిటీ వ్యాలీలో తన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) గిగాఫ్యాక్టరీ మొదటి దశను ప్రారంభించి భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.
ఇది దేశంలోనే మొదటి లీడ్ (LEED - లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్) అర్హత పొందిన అత్యాధునిక ఫ్యాక్టరీ. 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించారు. గ్రిడ్-స్కేల్ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం 4.8 గిగావాట్-అవర్ల (GWh) బ్యాటరీ ప్యాక్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కర్మాగారం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. ఇక ఫ్యాక్టరీ రెండవ దశ ఎలా ఉండనుందో సిగ్ని ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట్ రాజారామన్ వెల్లడించారు. రెండో దశలో మరో రూ.150 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 10.8 GWhకు విస్తరించనున్నట్లు చెప్పారు. 24 నెలల్లో పూర్తయ్యే ఈ విస్తరణ 1,000 పైగా ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని వివరించారు.
ఈ గిగాఫ్యాక్టరీ మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ట్విన్ మోడలింగ్, స్మార్ట్-గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి బ్యాటరీ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సిగ్ని, ఐఐటీ-మద్రాస్తో భాగస్వామ్యం ద్వారా సోడియం-అయాన్ బ్యాటరీలు, సూపర్కెపాసిటర్ల వంటి తదుపరి తరం బ్యాటరీ పదార్థాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి శక్తి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అరుదైన పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. 1 GWh ఆర్డర్ పైప్లైన్తో, సిగ్ని ఎనర్జీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.